ఈ నెల 12 నుంచి మొదలైన తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. ఉభయసభలు నిరవదికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 11 రోజులు సమావేశాలు జరుగగా ప్రభుత్వం 12 బిల్లులు ప్రవేశ పెట్టింది., ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ పెంచుతూ బిల్లులు ప్రవేశపెట్టింది. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల విభజించాలనే కేంద్రం ప్రతిపాదనని వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు.
బిఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించినప్పటికీ, శాసనసభలో మాత్రం వారిని ఆ పార్టీ సభ్యులుగానే పరిగణించి ఆ పార్టీకి 38 మంది, కాంగ్రెస్కు 65, బీజేపికి 8, మజ్లీస్కు 7 మంది, సీపీఐకి ఒక శాసనసభ్యుడు ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు.
మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలకమైన ఈ బడ్జెట్ సమావేశాలకు కూడా రాకుండా మొహం చాటేశారు. తొలిరోజున హాజరు వేయించుకునేందుకే వచ్చారని సిఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఈసారి సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై అధికార, బిఆర్ఎస్ పార్టీ సభ్యుల మద్య చాలా వాడివేడిగా వాదోపవాదాలు సాగాయి. గత సమావేశాలతో పోలిస్తే ఈసారి బిఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరింత తీవ్రంగా ఎదురుదాడి చేసింది. నిన్న శాసనసభ సమావేశాలు ముగిసే రోజున కేటీఆర్ నేరుగా సిఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేయగా వాటిని ఆయన కూడా సమర్ధంగా తిప్పి కొట్టారు.