ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగిపోవడం విజ్ఞుల లక్షణం. కానీ ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు కూడా ఇదే చేస్తూ అందిన కాడికి దోచేసుకున్తున్నారు.
ప్రస్తుతం గ్యాస్ సిలెండర్ల కొరత తీవ్రంగా ఉంది కనుక ప్రజలు ఎడాపెడా ఆన్లైన్లో బుకింగ్స్ చేసేస్తున్నారు. దీనినే సైబర్ క్రైమ్ నేరగాళ్ళు గొప్ప అవకాశంగా పసిగట్టారు.
అదనంగా కాస్త డబ్బు చెల్లిస్తే చాలు తక్షణం గ్యాస్ సిలిండర్ ఇంటికి డెలివరీ చేస్తామని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తున్నారు. గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్నవాళ్ళ నంబర్లకు మెసేజులు కూడా పంపిస్తున్నారు. వారి మాటలు నమ్మి వారు పంపిన లింక్ క్లిక్ చేస్తే చాలు మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేసేస్తారు.
కనుక తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజులు, లింక్స్ వేటినీ ఉపయోగించవద్దని తక్షణం వాటిని డిలీట్ లేదా బ్లాక్ చేయాలని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్యాస్ సరఫరా చేసే కంపెనీ తాలూకు అధికారిక వెబ్సైట్ లేదా గ్యాస్ ఏజన్సీ ఫోన్ నంబర్ ద్వారానే గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఒకవేళ సైబర్ క్రైమ్ నేరగాళ్ళ చేతిలో మోసపోతే సందేహించకుండా తక్షణం 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు, హైదరాబాద్ సీపీ విసి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.