రాజకీయ నాయకులకు పోలీసులు, కేసులు, కోర్టులు, జైళ్ళతో సాంగత్యం ఎక్కువైనందునో ఏమో ఆ భాషని విరివిగా వాడేస్తున్నారు.
రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిందని, తమ పాలన అద్భుతంగా సాగుతోందంటూ విజయోత్సవాలు నిర్వహించుకుంటుంటే, రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమైనదంటూ బిఆర్ఎస్ పార్టీ తరపున హరీష్ రావు నేడు ‘ఛార్జ్ షీట్’ విడుదల చేశారు. దానికి ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన’ అంటూ ఓ టైటిల్ కూడా పెట్టారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఏడాది పాలనలో రాష్ట్రంలో రోడ్డెక్కని ప్రజలు లేరు. రైతులు, నిరుద్యోగులు, వృద్ధులు, పోలీసులు, విద్యార్ధులు, ఉపాధ్యాయులు, సామాన్య ప్రజలు ప్రతీ ఒక్కరినీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోడ్డెక్కించింది.
మెట్రో రైలు రద్దు, ఫార్మా సిటీ రద్దు, హైడ్రాతో కూల్చివేతలు వంటి నిర్ణయాలన్నీ తెలంగాణ రాష్ట్రం పట్ల పెట్టుబదుదారులు, పారిశ్రామికవేత్తలలో ఆందోళన కలిగించాయి. అందుకే రాష్ట్రానికి రావలసిన పరిశ్రమలు, పెట్టుబడులు అన్నీ వెనక్కుపోతున్నాయి.
అవి చూసి మళ్ళీ సరిచేస్తామంటారు. కానీ ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఒక్క ఏడాదిలోనే తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంతగా దెబ్బ తీసింది. రేవంత్ రెడ్డి పాలన అస్త వ్యస్థంగా సాగుతోంది,” అంటూ హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..