ఏడు దశలలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలలో నేడు 4వ దశ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. తెలంగాణలో 17 ఎంపీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్ వెలువడగానే అభ్యర్ధుల నామినేషన్స్ దాఖలు చేయవచ్చు. ఈ నెల 25వరకు గడువు ఉంది. మే 13న పోలింగ్ జరిపి, జూన్ 4న ఓట్లు లెక్కిస్తారు. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు.
కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించవలసి ఉంది. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు 17 స్థానాలకు తమ అభ్యర్ధులను ప్రకటించాయి. మజ్లీస్ ఎప్పటిలాగే హైదరాబాద్ నుంచి మాత్రమే పోటీ చేస్తోంది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి కూడా మూడు పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించాయి. మూడు పార్టీలు, వాటి అభ్యర్ధులు ఇప్పటికే జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. కనుక నేడు నోటిఫికేషన్ వెలువడగానే నామినేషన్స్ వేసేందుకు అభ్యర్ధులు సిద్దంగా ఉన్నారు.