లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతోందో తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతుంటారు. కనుక ప్రముఖ మీడియా సంస్థలు ఇండియా టీవీ-సీఎన్ఎన్ సంస్థలు తెలంగాణలో సర్వే చేసి తమ నివేదికని ప్రకటించాయి.
వాటి అంచనా ప్రకారం ఈసారి లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 8 సీట్లు గెలుచుకోబోతోంది. తర్వాత స్థానంలో బీజేపీ 6 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపాయి. గత పదేళ్లుగా తెలంగాణ రాజకీయాలను శాశించిన బిఆర్ఎస్ పార్టీ ఈసారి కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకొని మూడో స్థానానికే పరిమితం కాబోతోందని ఇండియా టీవీ-సీఎన్ఎన్ సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13న లోక్సభతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా జరుగబోతున్నాయి. గత ఎన్నికలలో వైసీపి భారీ మెజార్టీతో అధికారంలోకి రాగా ఈసారి ఓటమి తప్పకపోవచ్చని ఏబీపీ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్-సీ ఓటర్ సర్వే తేల్చి చెప్పేసింది.
ఏపీలో 25 ఎంపీ సీట్లలో ఈసారి అధికార వైసీపికి కేవలం 5 మాత్రమే వస్తాయని, టిడిపి, జనసేన, బీజేపీ కూటమి మిగిలిన 20 సీట్లు గెలుచుకోబోతోందని వెల్లడించింది.