లోక్సభ ఎన్నికలలో పోటీ చేయబోతున్న 19 మంది బిఆర్ఎస్ అభ్యర్ధులకు ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరపున కేసీఆర్ ఒక్కొక్కరికీ రూ.95 లక్షల చొప్పున చెక్కులు అందజేయనున్నారు.
ఈనెల 18వ తేదీన అభ్యర్ధులు అందరూ తెలంగాణ భవన్లో జరిగే సమావేశానికి వచ్చి బీ-ఫారంలు, వాటితో పాటు చెక్కులు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. అభ్యర్ధులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు, ముఖ్య నేతలు అందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. వారితో లోక్సభ ఎన్నికల ప్రచార వ్యూహాలు, తన బస్సు యాత్ర గురించి చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు.
అదే రోజున లోక్సభ ఎన్నికలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడబోటోంది. ఆరోజు నుంచి ఏప్రిల్ 25వరకు అభ్యర్ధులు నామినేషన్స్ వేసేందుకు గడువు ఉంటుంది. మే 13న పోలింగ్ జరుగబోతోంది. జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కించి వెంటవెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.