ఓ పక్క రాష్ట్రంలో ఎండలు మండిపోతుంటే మరోపక్క మూడు పార్టీలు పరస్పర విమర్శలతో రాజకీయ వాతావరణం కూడా చాలా వేడెక్కిపోయింది. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా రాజకీయ నేతలు ఎన్నికల ప్రచారం చేస్తుంటే, వారి సభలు, రోడ్ షోలకు ప్రజలు కూడా అలాగే హాజరవుతున్నారు.
అందరూ చూస్తుండగానే ఎన్నికల తేదీ దగ్గరకు వచ్చేసింది. మరో రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతోంది. వెంటనే అభ్యర్ధుల నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతుంది. వాటికి ఏప్రిల్ 25 వరకు గడువు. ఆ తర్వాత మే 13న పోలింగ్. అంటే వచ్చే నెల ఈపాటికి ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయిపోతుందన్న మాట!
గతంలో ఎన్నికలంటే ఉరకలేసే బిఆర్ఎస్ పార్టీ ఈసారి అంత హుషారుగా లేదు. కనుక పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మద్య అన్నట్లు మారింది. లోక్సభ ఎన్నికలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకి సంబందించినవి కనుక వీటి ఫలితాలు తెలంగాణ రాష్ట్రంపై పెద్దగా ప్రభావం పడవు. రాష్ట్రంలో ఈసారి ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఇవన్నీ ఈసారి ఈ ఎన్నికలు, పోలింగ్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.