బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న చెల్లి కల్వకుంట్ల కవితని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళుతున్నారు.
సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ముందు ఈడీ కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోవడం, ఆ తర్వాత పార్టీ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్, బీజేపీలలో చేరిపోతుండటంతో, ఆ కార్యక్రమాలలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న కారణంగా కేటీఆర్ ఇన్ని రోజులు ఢిల్లీకి వెళ్ళి చెల్లిని పరామర్శించలేకపోయారు.
ఇంతకాలం ఈడీ కస్టడీలో ఉన్న ఆమెను ఇప్పుడు సీబీఐ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తోంది. రేపు ఉదయం 10.30 గంటలకు ఆమెను మళ్ళీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచబోతున్నారు.
ఆమె ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పట్లో ఆమెకు బెయిల్ దొరికే అవకాశం కనిపించడం లేదు. కనుక చెల్లి కల్వకుంట్ల కవితని పరామర్శించి, ధైర్యం చెప్పేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళుతున్నారు.
అయితే ఆమెను కలిసి తిరిగి వచ్చేస్తారా లేదా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసి ఆమెకు విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేస్తారా అనేది రేపు తెలిసే అవకాశం ఉంది.