లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. అందులో ప్రకటించిన అనేక హామీలలో తమిళ భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడం, ప్రపంచవ్యాప్తంగా తిరువళ్ళువర్ సాంస్కృతిక కేంద్రాలు ఏర్పాటు చేయడాన్ని కూడా చేర్చడం విశేషం.
అలాగే హిందూత్వ అజెండాని కూడా దానికి జోడించింది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వృద్ధులు దేశంలోని పుణ్యక్షేత్రాల దర్శించుకునేందుకు చేయూత అందిస్తామని హామీ ఇచ్చింది.
అభివృద్ధి అంశాలకు సంబంధించి ఉత్తర, దక్షిణ, తూర్పు భారత దేశంలో బుల్లెట్ రైళ్ళు, మరిన్ని ప్రాంతాలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళు, విమానయాన, అంతరిక్ష రంగాల అభివృద్ధి, విద్యుత్ వాహన రంగానికి మరింత ప్రోత్సాహకాలు వంటివి బీజేపీ మ్యానిఫెస్టోలో చేర్చింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టిఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై కూడా బీజేపీ దృష్టి సారించి మరింత కఠినమైన చట్టాలు, పారదర్శకంగా నియామక ప్రక్రియ జరిగేందుకు ప్రాధాన్యత ఇస్తామని బీజేపీ తన మ్యానిఫెస్టోలో పేర్కొంది.
దేశంలో 70 ఏళ్ళు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్లో భాగంగా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.