బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హిందూవాదం, గో రక్షణ గురించి తరచూ మాట్లాడే మాటలు అందరూ వినే ఉంటారు. కానీ ఆయన తొలిసారిగా తెలుగులో ఓ పాట పాడారు. త్వరలో జరుగబోయే శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకొని ఆయన ‘హిందువుగా పుట్టాలి... హిందువుగా బ్రతకాలి... హిందువుగా చావాలి...” అంటూ ఓ పాట పాడారు. దాని ప్రమో సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆయన తెలుగులో పాట పాడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఆయన 13 ఏళ్ళ క్రితం హైదరాబాద్లో తొలిసారిగా శ్రీరామనవమి శోభాయత్ర నిర్వహించారు, అప్పటి నుంచి ఏటా శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నెల 17న ధూల్పేటలోని ఆకాశపూరి వద్ద గల హనుమాన్ ఆలయం వద్ద ఈ పాట సీడీలను విడుదల చేసి శోభాయాత్రలో పాల్గొంటారు.
2018 డిసెంబర్లో జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ 119 స్థానాలకు పోటీ చేస్తే రాజాసింగ్ ఒక్కరే ఘోషామహల్ నుంచి గెలిచారు. ఈసారి ఎన్నికలలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో రాజాసింగ్ కూడా ఉన్నారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్ ట్రిక్ సాధించారు.