కాళేశ్వరం ప్రాజెక్టులో మరికొన్ని పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దీనిపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో బిజెపి బృందం నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమార్జనకు అలవాటుపడిన సిఎం కేసీఆర్, లాక్డౌన్ సమయంలో టెండర్లు పిలిచి మెగా, నవయుగ, ప్రతిమ సంస్థలకు వేలకోట్ల విలువైన పనులు కట్టబెట్టేరని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో తనను ఎవరూ ప్రశ్నించకుండా ఉండేందుకు మొదట ప్రతిపక్షాలను బలహీనపరిచిన సిఎం కేసీఆర్, తరువాత మీడియాను గుప్పెట్లో పెట్టుకొని కంట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి బిజెపి వ్యతిరేకం కాదని కానీ ఈవిధంగా జేబు సంస్థలకు టెండర్లు కట్టబెడుతూ వాటి నుంచి కమీషన్లు దండుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని గవర్నర్ తమిళి సై దృష్టికి తీసుకువెళ్లామని, ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సిబిఐ చేత విచారణ జరిపించాలని కోరామని, ఆమె తగిన చర్యలు తీసుకొంటారని ఆశిస్తున్నామని బండి సంజయ్ అన్నారు.