తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తరువాత రాష్ట్రంలోని 129 పురపాలక సంస్థలలో గల 3,052 వార్డులకు మొత్తం 25,768 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో 432 నామినేషన్లు వివిద కారణాలతో తిరస్కరించబడ్డాయి. దాంతో మున్సిపల్ ఎన్నికల బరిలో 25,336 అభ్యర్ధులు మిగిలారు.
వారిలో అధికార తెరాసకు చెందినవారు 8,956 మంది, కాంగ్రెస్-5,365, బిజెపి-4,179, సిపిఐ-269, సిపిఎం-268, టిడిపి-433, మజ్లీస్-441, ఎన్సీపీ-36, వైసీపీ-4 నామినేషన్లు వేశారు. 4,899 మంది స్వతంత్ర అభ్యర్ధులు కూడా నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉంది. కనుక ఆలోగా అన్ని పార్టీలు తమ రెబెల్ అభ్యర్ధులను బుజ్జగించి వారిచేత నామినేషన్లు ఉపసంహరింపజేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోగల 60 డివిజన్లలో మొత్తం 1,022 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే కరీంనగర్లో ఎన్నికల ప్రక్రియ కాస్త ఆలస్యంగా మొదలైనందున ఈరోజు మధ్యాహ్నంలోగా నామినేషన్ల పరిశీలన పూర్తవుతుంది.