సీనియర్ కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ, ఆయన భార్య పద్మినీరెడ్డి ఇద్దరూ బిజెపిలో చేరబోతునట్లు వచ్చిన వార్తలపై ఆయన వెంటనే స్పందించారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “నేను పార్టీ మారుతున్నానంటూ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. కొందరు వ్యక్తులు దురుదేశ్యపూర్వకంగా నాపై ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను హైదరాబాద్లోనే ఉన్న మాట వాస్తవం కానీ బిజెపి నేతలెవరినీ నేను కలవలేదు. ఆ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను,” అని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా కనిపిస్తోంది కనుక తెరాసను వ్యతిరేకిస్తున్నవారందరికీ ఏకైక ప్రత్యామ్నాయంగా బిజెపి మాత్రమే కనిపిస్తోంది. బిజెపి కూడా రాష్ట్రంలో బలపడాలనుకుంటోంది కనుక అటువంటి నేతలను గుర్తించి సాధారంగా పార్టీలోకి ఆహ్వానిస్తోంది. కనుక దామోదర రాజనర్సింహ చేసిన ఈ ఖండన ప్రకటన నిజమా లేక ఆయన బిజెపిలో చేరబోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు నిజమా? అనేది త్వరలోనే తెలియవచ్చు.