కొత్త సచివాలయం నిర్మాణం పూర్తయ్యే వరకు ట్యాంక్ బండ్ రోడ్డుకు ఎదురుగా ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్ (బీఆర్క్ భవన్)ను తాత్కాలిక సచివాలయంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ భవనసముదాయాన్ని ‘హైసెక్యూరిటీ జోన్’ పరిధిలోకి వచ్చింది. దాంతో నగర పోలీసులు ఆ భవనం చుట్టుపక్కల పటిష్టమైన భద్రత కల్పించడానికి అవసరమైన ఏర్పాట్లు చురుకుగా చేస్తున్నారు. ప్రస్తుత సచివాలయంలోని సీఎంవో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రుల కార్యాలయాలతో సహా వివిద ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఆ భవనంలోకి తరలిస్తున్నందున వివిఐపిలు, ఉన్నతాధికారుల రాకపోకల వీలుగా ఆ భవనం చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కళాంజలి, హోప్ ఆసుపత్రి, జీహెచ్ఎంసీ, రిట్జ్ హోటల్ తదితర ప్రాంతాలలో బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. సైబర్, క్రైమ్, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో కూడిన ఒక బృందం బీఆర్క్ భవన్ భద్రత, సైబర్ సెక్యూరిటీ కోసం చేయవలసిన ఏర్పాట్లపై అధ్యయనం చేస్తోంది. ఒకటిరెండు రోజులలో దాని నివేదిక వస్తే దానిని బట్టి అవసరమైన ఏర్పాట్లు, మార్పులు చేర్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.