త్వరలో బిజెపిలో చేరాలనుకొంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం హైదరాబాద్లో తన మునుగోడు నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలతో సమావేశమైనప్పుడు వారు ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారు. తాను ఎందుకు బిజెపిలో చేరాలనుకొంటున్నానో ఆయన చెప్పడం మొదలుపెట్టగానే వారు “మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము కావాలనుకుంటే మీరు వెళ్ళండి...”అంటూ మొహం మీద చెప్పేసి ‘జై కాంగ్రెస్ పార్టీ’ అని నినాదాలు చేస్తూ సమావేశంలో నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయారు. ఆయనకు బాగా సన్నిహితులైన కొద్దిమంది మాత్రం ఉండిపోయారు.
వారిని ఉద్దేశ్యించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, “నేను పదవుల కోసం పార్టీ మారాలనుకోవడం లేదు. రాష్ట్రంలో నిరంకుశపాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సిఎం కేసీఆర్ను గద్దె దించడం కోసమే పార్టీ మారుతున్నాను. నా పార్టీని, నా సుశీ కంపెనీని ఛిన్నాభిన్నం చేసిన కేసీఆర్కు నేను దాసోహం అనదలచుకోలేదు. చివరివరకు ఆయనతో పోరాడాలనే నిశ్చయించుకున్నాను. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెడదామా లేక పోరాడి కేసీఆర్ను గద్దె దించుదామా? మీరే ఆలోచించుకోండి. నేను ఎవరినీ నాకూడా రమ్మనమని బలవంతం చేయను. నాతో వచ్చే వారిని కాదనను. నా ఏకైక లక్ష్యం ఏనాటికైనా కేసీఆర్ను గద్దె దించడమే. ఆ లక్ష్యసాధన కోసమే కొత్త మార్గం ఎంచుకొంటున్నాను,” అని అన్నారు.