అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయం పొందిన తెలంగాణ జనసమితి (టిజేఎస్) ఇంతవరకు కోలుకోలేకపోయింది. హైదరాబాద్లోని టిజేఎస్ కార్యాలయంలో కోదండరాం అధ్యక్షతన మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. దానిలో లోక్సభ ఎన్నికలతో సహా వివిద అంశాలపై చర్చించినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికలలో టిజేఎస్కు బలమున్న రెండు స్థానాలలో అభ్యర్ధులను నిలబెట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికోసం మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరాలని నిర్ణయించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోతే ఆ పార్టీకి మద్దతు ప్రకటించి పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో టిజేఎస్ ఏవిధంగా ముందుకు సాగాలనే అంశంపై లోతుగా చర్చించారు. ఈ సమావేశంలో ఉపాద్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కూడా చర్చించారు.
తెరాస ధాటికి రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి వంటి జాతీయపార్టీలే తట్టుకోలేక తమ మనుగడ కాపాడుకోవడానికి తిప్పలు పడుతుంటే, కోదండరాం తప్ప మరెవరూ గుర్తింపు కలిగిన నేతలు లేని తెలంగాణ జనసమితి ఎంతో కాలం మనుగడ సాగించలేకపోవచ్చు. ఒకవేళ కొనసాగినా తెలంగాణలో వైకాపాలాగా ఒక డమ్మీ పార్టీగా మిగిలిపోవచ్చు. కనుక టిజేఎస్ను మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే మంచిదేమో?