2018-19 సం.లకు తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ ను రాష్ట్ర ఆర్దికమంత్రి ఈటల రాజేందర్ గురువారం శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు. గత బడ్జెట్ కంటే ఈసారి బడ్జెట్ కనీసం 15 శాతం ఎక్కువగా అంటే సుమారు రూ.1.78 లక్షల కోట్లు వరకు బడ్జెట్ ఉండవచ్చు. పంటరుణాల మాఫీ ముగియడంతో దానికి కేటాయించే నిధులను ఇప్పుడు వేరే అవసరాలకు ఉపయోగించుకొనే అవకాశం ఏర్పడింది. వచ్చే నెల నుంచి రాష్ట్రంలో రైతులు అందరికీ ఎకరాకు రూ.4,000 చొప్పున పంటపెట్టుబడి అందించనుంది. కనుక బడ్జెట్ లో దానికి కేటాయింపులు ఉంటాయి. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణా రైతు సమన్వయ సమితికి మూలధనంగా రూ.200 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ఏప్రిల్ లోగా సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కనుక ఈరోజు ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ తెరాస సర్కార్ కు చివరి బడ్జెట్ అవుతుంది. కనుక ప్రజలను ఆకట్టుకొనేందుకు ఈ బడ్జెట్ లో సంక్షేమ పధకాలకు బారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. అలాగే ప్రజాకర్షక పధకాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం 11గంటలకు మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెడతారు.