పార్టీ ఏర్పాటు కాలేదు...చేరికలు షురూ!

March 13, 2018


img

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్థాపించబోతున్న తెలంగాణా జన సమితి (టిజెఎస్) రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు కానీ అప్పుడే ఆ పార్టీలో రాజకీయ నేతల చేరికలు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ సోమవారం ప్రొఫెసర్ కోదండరాం సమక్షంలో టిజెఎస్ లో చేరారు. త్వరలోనే మరికొంతమంది టిజెఎస్ లో చేరబోతున్నట్లు చెప్పారు. 

ఈ సందర్భంగా దిలీప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని అనుకొంటే, రాష్ట్రంలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొనున్నాయి. అందుకే రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రొఫెసర్ కోదండరాం మళ్ళీ పూనుకోవలసివస్తోంది. అయన నేతృత్వంలో ఏర్పాటవుతున్న పార్టీ తెరాసకు సరైన ప్రత్యామ్నాయమని భావిస్తున్నాను. తెలంగాణా సాధన కోసం పోరాడినవారందరూ ప్రొఫెసర్ కోదండరాంకు మద్దతు తెలుపవలసిన అవసరం ఉంది. టిజెఎస్ వస్తే తెరాస మెల్లగా కనుమరుగవవచ్చు,” అని అన్నారు. 



Related Post