కరోనా వైరస్ గురించి మీడియాలో వస్తున్న వార్తలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందిస్తూ, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ఒక్కరికీ కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కాలేదు. కనుక ఈ అంశంపై మీడియా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కరోనా వైరస్ గురించి సంబందిత ఆసుపత్రి వైద్యులను సంప్రదించిన తరువాతే వార్తలు ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని ట్వీట్ చేశారు.
కరోనా వైరస్ చాలా ప్రాణాంతకమైనదే కావచ్చు కానీ దానికంటే అది వ్యాపిస్తున్నట్లు మీడియాలో వచ్చే పుకార్లు ఇంకా ప్రమాదకరమైనవని చెప్పక తప్పదు. అటువంటి పుకార్లతో సమాజంలో కొత్త సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. ఉదాహరణకు కరోనా వైరస్ పుకార్ల కారణంగా సాధారణ జలుబు చేసిన వ్యక్తిని ఉద్యోగంలో నుంచి తొలగిస్తే ఏమవుతుందో ఆలోచిస్తే ఈ పుకార్ల పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. కనుక మంత్రి ఈటల రాజేందర్ చెప్పినట్లు మీడియా సున్నితమైన ఈ విషయంలో సంయమనం పాటించడం చాలా అవసరం. అలాగే ప్రజలు కూడా పుకార్లను నమ్మకుండా కరోనా వైరస్ సోకకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకొంటే మంచిది.