దేశంలో పేద ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యభీమా పధకం ప్రవేశపెట్టిన కేంద్రప్రభుత్వం, మధ్యతరగతి ప్రజల కోసం వేరేగా మరోపధకం ప్రవేశపెట్టబోతోంది. ఏడాదికి కేవలం రూ.300 ప్రీమియంతో కేన్సర్, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక రోగాలకు ఉచిత చికిత్స అందించడమే లక్ష్యంగా ఈ పధకం రూపొందిస్తోంది. దీని కోసం దేశవ్యాప్తంగా 1.5 లక్షల ఆసుపత్రులను ఎంపిక చేయనుంది.
దేశంలో ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారికి, కేంద్రరాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఖరీదైన వైద్యం చేయించుకొనే వెసులుబాటు ఉంది. నిరుపేదల కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఆరోగ్యపధకాలు ప్రవేశపెడుతున్నాయి కనుక వారు కూడా కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకోగలుగుతున్నారు. కానీ మధ్యతరగతివారి కొద్దిపాటి ఆదాయం కారణంగా అటు సొంతంగా ఖరీదైన వైద్యం చేయించుకోలేక, ప్రభుత్వ పధకాలకు అర్హత లేకపోవడం వలన రోగాలతో సతమతమవుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన కేంద్రప్రభుత్వం ఈ కొత్త పధకాన్ని అమలుచేయడానికి సిద్దం అవుతోంది. దీనివలన మధ్యతరగతి ప్రజలకు చాలా మేలు కలుగుతుంది.