తెలంగాణ రాష్ట్రంలో అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డైట్ కాలేజీల వేసవి శలవులు ఈ నెల 20వరకు పొడిగించబడ్డాయి. ముందు ప్రకటించిన ప్రకారం ఈనెల 15తో అంటే మంగళవారంతో వేసవి శలవులు ముగిశాయి. కానీ మరో 5 రోజులు పొడిగించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ డైరక్టర్ శ్రీదేవసేన, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్ నిన్న వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 1 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులు, జూలై 15 తరువాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ఆన్లైన్లో ప్రారంభిస్తామని చెప్పిన ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్, వేసవి శలవులు 20వరకు పొడిగించడంతో విద్యార్దులలో అయోమయం సృష్టించినట్లయింది. అంటే జూన్ 21 నుంచే తరగతులు మొదలవుతాయా లేదా జూన్ నెలాఖరు వరకు అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగించి జూలై 1 నుంచి తరగతులు ప్రారంభిస్తారా? అనేదానిపై స్పష్టత ఈయవలసి ఉంది.