తెలంగాణలో మళ్ళీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి, ఇంటర్ ప్రధమ సంవత్సరం పరీక్షలను రద్దు చేసింది. రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పదో తరగతి, ఇంటర్ ప్రధమ విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేయబోతున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇంటర్ ద్వితీయ పరీక్షలను కొంతకాలం వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
దీంతో రాష్ట్రంలో 5.21 లక్షల మంది పదో తరగతి విద్యార్దులు పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులైనట్లు అయ్యింది. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బ్యాక్లాగ్లున్న విద్యార్దులు 1,99,019 మంది ఉన్నారు. ప్రధమ సంవత్సర పరీక్షలలో వారు ఫెయిల్ అయినవాటికీ కనీసమార్కులు కలిపి పాస్ చేస్తామని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ఈసారి పరీక్షలు రద్దయిన కారణంగా ఎంసెట్ ర్యాంకులకు 25 శాతం ఇంటర్ వెయిటేజ్ మార్కులు కలపకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. కనుక ఎంసెట్ ప్రవేశ పరీక్షలలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఈసారి ర్యాంకులు నిర్ణయిస్తారు.