రానున్న రోజులలో రైల్ ప్రయాణాలు మరింత భారం కానున్నాయి. దేశంలో అత్యంత రద్దీగా ఉండే సుమారు 700 నుంచి 1050 రైల్వేస్టేషన్లలో టికెట్తో పాటు యూజర్ ఛార్జీలను కూడా అదనంగా వసూలు చేయడానికి రైల్వేశాఖ సిద్దం అవుతోంది. రైల్వేస్టేషన్లను మరింత ఆధునీకరించడానికే యూజర్ ఛార్జీలను వసూలు చేయాలనుకొంటున్నామని రైల్వేబోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ చెప్పారు. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలంటే యూజర్ ఛార్జీలు వసూలు చేయక తప్పదన్నారు.
ఇప్పటికే ఐఆర్సీటీసీ అధ్వర్యంలో దేశంలో కొన్ని ప్రైవేట్ రైళ్ళు నడుస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో మరో 109 మార్గాలలో ప్రైవేట్ రైళ్ళను నడిపించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, జీఎంఆర్ ఇన్ఫ్రా, బొంబార్డియర్ ఇన్కార్పొరేషన్, అల్స్టోమ్ ఎస్ఏలతో సహా మరికొన్ని ప్రైవేట్ సంస్థలు దేశంలో ప్రైవేట్ రైళ్ళను నడిపించేందుకు ముందుకు వచ్చాయి.
వాటి టికెట్ ధరను నిర్ణయించుకొనే హక్కును ఆయా సంస్థలకే కల్పించబోతున్నట్లు వీకే యాదవ్ చెప్పారు. అయితే వాటికి కేటాయించిన మార్గాలలో ప్రైవేట్, ప్రభుత్వ బస్ సర్వీసులు, విమానసర్వీసులు కూడా తిరుగుతున్నాయనే విషయం గుర్తుంచుకొని టికెట్ ధర నిర్ణయించుకొంటాయని ఆశిస్తున్నామని వీకే యాదవ్ అన్నారు.