ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ (సబ్ టైటిల్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్) సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ సినిమాలో నయనతార, కియరా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ ఐదుగురు హీరోయిన్లు ఉండటం ఇందుకు మరో కారణం. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘టాక్సిక్’ హక్కులను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఏకంగా రూ.120 కోట్లు ఇచ్చి సొంతం చేసుకున్నారు.
ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. కేజీఎఫ్ తర్వాత యష్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. కనుక అందరూ అతను నటించిన ‘టాక్సిక్’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో దీనిని విడుదల చేసే అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషిస్తున్నాను,” అని అన్నారు.
ఇదొక పీరియాడికల్ యాక్షన్ సినిమా. దీనికి కధ, దర్శకత్వం: గీతు మోహన్ దాస్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: రాజీవ్ రవి, స్టంట్స్: జేజే పెర్రీ (హాలీవుడ్), ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.
కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణతో కలిసి యష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి నిర్మించి తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో డబ్ చేసి మార్చి 19న విడుదల చేయబోతున్నారు.