కరోనా వైరస్ను అరికట్టేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో వ్యూహాన్ పట్టణంలో రోజూ డజన్ల కొద్దీ కరోనా రోగులు చనిపోతూనే ఉన్నారు. చైనాలో ఇప్పటి వరకు 500 మందికి పైగా కరోనా వైరస్తో చనిపోయినట్లు అధికారికంగా చెపుతున్నప్పటికీ చనిపోయినవారి సంఖ్య వేలల్లో ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కరోనా వైరస్ తీవ్రతను ముందే గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ గాంధీ, ఫీవర్ ఆసుపత్రులలో ప్రత్యేకంగా కరోనా వార్డులు ఏర్పాటు చేసి అటువంటి రోగలక్షణాలున్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తోంది. ఇప్పటివరకు కరోనా లక్షణాలతో వచ్చినవారికి నిర్వహించిన వైద్య పరీక్షలలో ఎవరికీ కరోనా సోకలేదని తేలింది. అయితే హైదరాబాద్ నగరంలో పనిచేస్తూ ఇటీవల చైనా వెళ్ళివచ్చిన ఇద్దరు విదేశీయులకు వైద్యపరీక్షలు నిర్వహించగా వారిరువురికీ కరోనా వైరస్ సోకినట్లు తాజా సమాచారం. వారిరువురినీ గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేకవార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వైద్య ఆరోగ్యశాఖ ఈవిషయాన్ని ఇంకా దృవీకరించవలసి ఉంది.