తెలంగాణ రాష్ట్రంలో సామాన్యులకు సైతం అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉండేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్యవిధానం చాలా బాగుందని, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలలో ప్రభుతాసుపత్రులను అప్-గ్రేడ్ చేయడానికి, కరీంనగర్, ఖమ్మం జిల్లా కేంద్రాలలో వైద్యకళాశాలలు ఏర్పాటు చేయడానికి నిధులు, అనుమతులు మంజూరు చేయించుకునేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ డిల్లీ వెళ్ళి కేంద్రమంత్రిని కలిసినప్పుడు, ఆయన సానుకూలంగా స్పందించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వైద్యవిధానాలను ప్రశంసించారు.
కాకతీయ వైద్య కళాశాలలో, అదిలాబాద్ ప్రభుత్వాసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ బ్లాకుల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరినట్లు ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కంటివెలుగు, కేసీఆర్ కిట్స్, ఉచిత డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు, బోధకాలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పింఛన్ వంటి సంక్షేమ వైద్య పధకాలు చాలా ప్రశంశనీయంగా ఉన్నాయని రాష్ట్ర ప్రజలే చెప్పుకొంటున్నారు. కేంద్రమంత్రి మెచ్చుకోవడంలో ఆశ్చర్యం ఏముంది? అయితే కేవలం మెచ్చుకోవడంతో సరిపెట్టకుండా ఇటువంటి గొప్ప పధకాలు అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహాయసహకారాలు అందిస్తే మరిన్ని చక్కటి పధకాలు అమలుచేయగలుగుతుంది.