కరోనా నివారణకు ‘కొవ్యాక్సిన్’ను తయారుచేసిన హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ అధినేత కృష్ణా ఎల్లా దానికి సంబందించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. చెన్నై ఇంటర్నేషనల్ సంస్థ సభ్యులతో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో వ్యాక్సిన్ కోసం మాపై ఒత్తిడి పెరిగిపోతోంది. కానీ ఒత్తిడిని తట్టుకొంటూనే సకాలంలో వ్యాక్సిన్ను అందించబోతున్నాము. ఇదివరకు రోటా వైరస్కు వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసేందుకు మాకు 6 నెలలు పడితే ఇప్పుడు నెలరోజులనే కొవాక్సిన్ మొదటిదశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసి రెండోదశకు చేరుకొన్నాము. అలాగని క్లినికల్ ట్రయల్స్ నాణ్యతలో ఏమాత్రం రాజీపడటంలేదు. త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసి ప్రపంచంలోకెల్లా అత్యుత్తమైన వ్యాక్సిన్ను సామాన్య ప్రజలకు సైతం అందుబాటు ధరలలోఅందించబోతున్నాము,” అని చెప్పారు.