కరోనా నేపధ్యంలో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం దేశప్రజలకు కొంత ఉపశమనం కలిగించే ప్రకటన చేశారు. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబందించి ఐటి రిటర్న్ దాఖలు చేయడానికి ఈనెల 30వరకు గడువు ఉండగా దానిని జూన్ 30వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ గడువులోగా పన్ను చెల్లింపు ఆలస్య రుసుమును 12 నుంచి 8శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే టిడిఎస్ జమలో ఆలస్య రుసుమును 18 నుంచి 9 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. పన్ను వివాదాల మొత్తాల చెల్లింపులో వసూలు చేస్తున్న 10 శాతం అదనపు రుసుమును తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
జీఎస్టీ చెల్లింపులకు సంబందించి మార్చి-ఏప్రిల్-మే నెలల జీఎస్టీ రిటర్న్ ల గడువును కూడా జూన్ 30 వరకు పొడిగించినట్లు తెలిపారు. అలాగే కాంపొజిషన్ స్కీమ్ రిటర్న్ దాఖలు గడువును కూడా జూన్ 30 వరకు పొడిగించినట్లు తెలిపారు. రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలపై పన్ను చెల్లింపులో ఆలస్యానికి ఎటువంటి అదనపు రుసుములు చెల్లించనవసరం లేదని, అలాగే రూ.5 కోట్లకు మించి టర్నోవర్ ఉన్న సంస్థలకు కూడా పన్ను చెల్లింపులు, వాటి వడ్డీలు, అపరాద రుసుం 9 శాతానికి తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.
పాన్-ఆధార్ అనుసంధానం కోసం వివాద్ సే విశ్వాస్ పధకానికి గడువు మార్చి 31 నుంచి జూన్ 30కు పొడిగిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఇక దేశ ఆర్ధిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఏమేరకు పడుతుంది లేదా పడింది? దానిని అధిగమించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఏఏ రంగాలకు ఉపశమనం కలిగించే ఆర్ధిక ప్యాకేజీలు ఎంత ఇవ్వాలి? వగైరాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, అది పూర్తికాగానే త్వరలోనే ప్రకటన చేస్తామని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.