ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త ప్రయోగం చేస్తోంది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులలో నగదురహిత ప్రయాణాల కోసం ‘ఛలో’ అనే ఒక మొబైల్ యాప్ను ప్రయోగాత్మకంగా విజయవాడలో ప్రవేశపెట్టింది. ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ, వైస్ ఛైర్మన్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈరోజు విజయవాడలో ఈ ‘ఛలో’ మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. ఈ యాప్ను మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని, ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేటప్పుడు బస్సులో ఉండే క్యూఆర్ కోడ్ను మొబైల్ ఫోన్తో స్కాన్ చేసి టికెట్కు సరిపడా డబ్బు ఫోన్ ద్వారానే చెల్లించవచ్చు.
దీనితో పాటు ‘ఛలో స్మార్ట్ కార్డు’ ను కూడా ఆర్టీసీ అధికారులు నేడు ఆవిష్కరించారు. వీటిని డిపోలవద్ద కొనుగోలు చేసుకొని, ఎప్పటికప్పుడు తగినంత సొమ్ముతో రీ-ఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. బస్సులో ప్రయాణించేటప్పుడు, దానిని కండక్టర్ వద్ద ఉండే టికెటింగ్ మెషీన్తో జోడించితే ప్రయాణానికి సరిపడా టికెట్ ఛార్జీ అందులో నుంచి కట్ అయిపోతుంది. ప్రస్తుతం వీటిని విజయవాడలో ప్రయోగాత్మకంగా పరీక్షించి చూస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలో అన్ని జిల్లాలలో వీటిని ప్రవేశపెట్టాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.