హైదరాబాద్ నగరంలో సుమారు 2 లక్షలకు పైగా ఆటోరిక్షాలు తిరుగుతున్నాయి. నగరంలో మెట్రో, ఎలెక్ట్రిక్ బస్సులు, క్యాబ్, బైక్ సర్వీసులు ఎన్ని వచ్చినప్పటికీ ఆటోలకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. నగరంలో చిన్న చిన్న గల్లీలలో కూడా ఆటోలు తిరుగుతూ నగరవాసులకు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే ఆటోల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతో వాటి కదలికలను గుర్తించేందుకు నగర పోలీస్ శాఖ వాటన్నిటినీ జిపిఎస్ తో అనుసంధానిస్తూ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.
దీని వలన ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు, ప్రయాణికులతో డ్రైవర్లు అసభ్యంగా వ్యవహరించినప్పుడు లేదా మరేదైనా సమస్యలు ఏర్పడినప్పుడు ఆ ఆటోకు సంబందించి పూర్తి సమాచారం, అది ఉన్న ప్రాంతం వివరాలు అన్ని క్షణాలలో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరిపోతాయి. అక్కడి నుంచి సమీపంలోఉన్న ట్రాఫిక్ పోలీసులకు ఆ సమాచారం అందుతుంది. వెంటనే వారు ఆ ఆటో వద్దకు చేరుకొని సమస్యను పరిష్కరించగలుగుతారు. దీనివలన నగరంలో ఆసాంఘిక శక్తుల ఉనికి కూడా బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికే నగరంలోని క్యాబ్ లన్నిటికీ ఈ అత్యాధునిక టెక్నాలజీతో కూడిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపు పూర్తికావచ్చింది. ఇప్పుడు ఆటోలకు కూడా దానిని విస్తరిస్తున్నారు.