మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన్, నయన సారిక జంటగా చేసిన ‘రాకాస’ ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలై పరవాలేదనిపించుకుంది. ఇప్పుడీ సినిమా మే 1 నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారం కాబోతోంది.
ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్విందర్ సింగ్, వాసు ఇంటూరి, రహిని, రోహాన్ రాయ్ ముఖ్యపాత్రలు చేశారు.
క్లుప్తంగా కథ: ప్రేమించిన యువతిని పెళ్ళి చేసుకునేందుకు అమెరికా నుంచి వస్తాడు వీరబాబు అలియాస్ వీరు (సంగీత శోభన్). కానీ వచ్చేసరికి ఆమె వేరొకరితో పెళ్ళికి సిద్ధమవుతుంది. ఆ పెళ్ళిని ఆపేందుకు స్నేహితులు బాలు (గెటప్ శ్రీను), సుబ్బలక్ష్మి (నయన సారిక)లతో కలిసి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈలోగా సుబ్బలక్ష్మితో వీరు ప్రేమలో పడతాడు. జీవితంలో నుంచి ఒకరు పోతే మరొకరు వచ్చారనుకుంటే ఆ సంతోషం కూడా లేకుండా మరో సమస్య ఎదురవుతుంది.
ఆ ఊళ్ళో రాక్షస కోటలో ఓ బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడని, అతనికి నరబలి ఇవ్వకపోతే ఊరంతా నాశనం చేస్తాడని గ్రామస్తులు నమ్ముతారు. అప్పుడు వీరు, బాలు కోటలోకి వెళ్తారు. వారి కోసం సుబ్బలక్ష్మి కూడా ఆ కోటలోకి ప్రవేశిస్తుంది. తర్వాత కోటలో ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మానస శర్మ, సంగీతం:అనుదీప్ దేవ్, కెమెరా:ఎదురోల్లు రాజు, ఆర్ట్: విష్ణువర్ధన్ పుల్ల, ఎడిటింగ్: అన్వర్ అలీ చేశారు.
పింక్ ఎలీఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నిహారికా కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ కలిసి రాకాస నిర్మించారు.