నేడు రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొని ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కూడా ఓ ఇంట్లో అంతకు మించి సందడిగా ఉంది. కారణం ఆ ఇంట్లో త్వరలో పెళ్ళి బాజాలు మోగబోతున్నందుకే.
కనుక తమ్ముడు సింహాద్రి శివకుమార్కి రాఖీ కట్టేందుకు అక్క కుటుంబ సమేతంగా మణుగూరు వచ్చింది. ఎదో పని మీద బయటకు వెళ్ళిన తమ్ముడు ఫోన్ చేసి కొద్ది సేపట్లో వచ్చి రాఖీ కట్టించుకుంటానని చెప్పాడు. కానీ కొంతఃసేపు తర్వాత ఆటోలో తమ్ముడు శవం వచ్చింది!
రాఖీ కట్టించుకుంటానని చెప్పిన తమ్ముడు శవమై ఇంటికి రావడంతో ఆమెతో సహా అతని తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
మణుగూరులో ఎం.కే అనే రౌడీ గ్యాంగ్ దాడిలో శివకుమార్ చనిపోయినట్లు తెలుస్తోంది. చనిపోయిన తమ్ముడు చేతికి అక్క కన్నీరు మున్నీరుగా విలపిస్తూ రాఖీ కడుతుంటే చుట్టూ ఉన్నవారు కూడా బాధతో కన్నీళ్ళు పెట్టుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని వారికి నచ్చజెప్పి శివకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని హంతకుల కోసం గాలింపు మొదలుపెట్టారు. పెళ్ళి బాజాలు మ్రోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగడం అదీ... రాఖీ పండుగనాడు చాలా బాధాకరం.