నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువకు నీటి విడుదల కొనసాగుతోంది. ఏపీ అధికారులు బుధవారం ఉదయం కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నించినప్పుడు తెలంగాణ అధికారులు అభ్యంతరం చెప్పారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల అధికారుల మద్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు జరిగాయి.
ఏపీ అధికారులు కుడి కాలువకు రెండు వేల క్యూసెక్కుల నీటి విడుదల చేసుకున్నందున, తెలంగాణ అధికారులు కూడా ఎడమ కాలువకు రెండు వేల క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. తాగు నీటి అవసరాల కోసం రెండు కాలువలకు నాలుగు రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు.
ఎడమ కాలువ ద్వారా విడుదల చేసిన నీటితో పెద్ద దేవులపల్లి జలాశయాన్ని నింపుతున్నారు. దీంతో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాలకు తాగునీటిని అందించనున్నారు.
నాగార్జున సాగర్ డ్యామ్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 536.40 అడుగులు ఉంది.
సాగర్ డ్యామ్ నిలువ సామర్ధ్యం 312.40 టీఎంసిలు కాగా ప్రస్తుతం 180.91 టీఎంసిలు నిలువ ఉన్నాయి.
ప్రస్తుతం ఇన్ ఫ్లో రోజుకి 21,241 క్యూసెక్కులు అవుట్ ఫ్లో కుడి ఎడమ కలిపి రోజుకి 4,000 క్యూసెక్కులు.
ప్రస్తుతం నాగార్జునసాగర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు భారీగా పోలీసులను మొహరించాయి. ఈ జలవివాడంతో అప్రమత్తమైన కృష్ణా రివర్ బోర్డుఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో వ్యవహరించేలా చర్యలు చేపట్టింది.