బుధవారం ఉదయం నేపాల్లో సంభవించిన మెరుపు వరదల్లో 750 మందికి పైగా గల్లంతయ్యారు. మరో 160 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో 133 మంది భారతీయులున్నారు. వారిలో 77 మంది ఈషా ఫౌండేషన్ యాత్రికులు కులున్నారు. చనిపోయిన వారిలో తమిళనాడులోని తంజావూరుకి చెందిన 37 మంది ఉన్నారు.
అయితే ఈ ఆకస్మిక ఈ వరదలు భారీ వర్షాల కారణంగా సంభవించలేదు. నేపాల్-టిబెట్ దేశాల సరిహద్దులో గోసాయిన్కుండ్ వద్ద బుధవారం ఉదయం 8.37 గంటలకు భూకంపం ఏర్పడింది. రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రత ఏర్పడిన ఈ భూకంపం వలన సరిహద్దు ప్రాంతంలో ఓ భారీ కొండ చరియ విరిగి పక్కనే ఉన్న లిండే నదిలో పడింది.
దాంతో ఆ నదిలో ఉప్పొంగి, టిబెట్ నుంచి నేపాల్ గుండా పారే భోటే కోషి నది ద్వారా నేపాల్లోని త్రిశూలి నదిలోకి వరద నీరు పోటెత్తింది.
ఎవరూ ఊహించని విధంగా హటాత్తుగా తొమ్మిది మీటర్ల ఎత్తున వరద విరుచుకుపడటంతో చాలా మంది దానిలో కొట్టుకుపోయారు. నేపాల్ భద్రతా సిబ్బంది, సైనికులతో సహా వివిధ దేశాల పర్యాటకులు కొట్టుకుపోయారు.
వరద ఉదృతికి భారీగా ఆస్తి నష్టం జరిగింది. కొన్ని పట్టణాలు, పలు గ్రామాలు నీట మునిగాయి. జలవిద్యుత్ ఉత్పత్తి సంస్థలు దెబ్బ తిన్నాయి. విద్యుత్ స్తంభాలు, టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థలు, అనేక రోడ్లు, భారీ వంతెనలు కొట్టుకుపోయాయి.
ప్రధాని మోడీ నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడారు. ఈ ఆపత్సమయంలో నేపాల్కు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలియజేశారు. తక్షణమే వాయుసేన విమానంలో అత్యవసరమైన మందులు, ఆహారం పంపించారు.
నేపాల్లో భారత్ ఎంబసీ హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. +977 985 131 6807, +977 970 910 7500 నంబర్లకు ఫోన్ చేసి మృతులు, గల్లంతైనవారు, ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నవారి వివరాలు తెలుసుకోవచ్చు.