జగిత్యాల సభలో కేసీఆర్ తన పాలనకు, కాంగ్రెస్ పాలనకు మద్య తేడా వివరిస్తూ, తన హయంలో రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, విద్యార్ధులు, సింగరేణి కార్మికులు, ప్రభుత్వోద్యోగులు ప్రతీ ఒక్కరినీ మోసం చేశారు. ప్రతీ రంగంలో విద్వంసం జరుగుతోంది.
నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టంచనుగా రైతు బంధు నిధులు విడుదలయ్యేవి. ఉద్యోగులకు సకాలంలో పీఆర్సిలు ఇచ్చాం. గ్రామాల నుంచి హైదరాబాద్ నగరం వరకు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశాం. పల్లె వనాలు, అర్బన్ పార్కులు ఏర్పాటు చేశాం.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వమంటే కమీషన్లు, అవినీతి. అక్రమాలు, దోపిడీ అన్నట్లు రెండున్నరేళ్ళుగా సాగుతోంది. పేద ప్రజలకు మేము ఎక్కడికక్కడ ఇళ్ళు నిర్మించి ఇస్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసి పేదవాళ్ళ ఇళ్ళను కూల్చేస్తున్నారు.
మూసీ ప్రాజెక్టు పేరుతో అక్కడ నివసిస్తున్న పేదల ఇళ్ళు కూల్చేస్తున్నారు. దీని కోసమేనా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు? నేను ముఖ్యమంత్రిగా ఉన్నని రోజులు పేద వాళ్ళ జోలికి ఎవరైనా వచ్చారా? మిషన్ కాకతీయ పేరుతో వందల చెరువులు పునరుద్దరించాము. కానీ అప్పుడు ఒక్క ఇల్లు కూల్చలేదు కదా?
ఓ కాంగ్రెస్ నాయకుడు జిల్లాకో హైడ్రా ఏర్పాటు చేస్తామని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ మేము మళ్ళీ అధికారంలోకి రాగానే హైడ్రాని ఎత్తి పక్కన పడేస్తాము.
నాడు గొర్రెలు ఇచ్చాము. ఇప్పుడు ఇవ్వడం లేదు. బీడీ కార్మికుల పరిస్థితి నా దృష్టికి రాగానే వారందరికీ పించన్లు ఇచ్చాము. నేను పేద ప్రజలు, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ ఒక్కరినీ పీడిస్తూ రోడ్డున పడేస్తోంది.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క ప్రాజెక్టు నిర్మించలేదు. కానీ కూల్చివేతలు, అరెస్టులు మాత్రమే చేస్తున్నారు.
కనుక తెలంగాణని మళ్ళీ సరిచేసుకోవాలంటే మనమందరం కలిసి కోట్లాడి మన ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోవాలి. మళ్ళీ రాజకీయ శక్తుల పునరేకీకరణ చేసి తెలంగాణ పునర్నిర్మాణం చేసుకోక తప్పదు,” అని ప్రసంగం ముగించారు.