తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ శనివారం ఉదయం యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నంది నగర్లో తన నివాసానికి వెళ్ళిపోయారు. ఆయన బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నందున వైద్యులు ఇంటికి పంపించేశారు.
కేసీఆర్ రెండు రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు కేటీఆర్, హరీష్ రావులతో సహా బిఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలతో అక్కడే సమావేశమయ్యి రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించారు. ఒకటి రెండు రోజులలో కేసీఆర్ ప్రెస్మీట్ పెట్టి నదీ జలాల పంపకాలు, వాటాల విషయం గురించి మాట్లాడుతారని బిఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పారు.
బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య వాడివేడిగా వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు కేసీఆర్ ఫామ్హౌస్లో మౌనంగా ఉండిపోయారు. కనుక ప్రెస్మీట్లో ఈ అంశంపై మాట్లాడే అవకాశం ఉంది.
కేసీఆర్ హయంలోనే ఏపీకి నదీ జలాలు యాధేచ్చగా వాడుకునేందుకు అనుమతించారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కనుక ప్రెస్మీట్లో రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పే అవకాశం ఉంది.
అలాగే కూతురు కల్వకుంట్ల కవిత వ్యవహారం వలన పార్టీకి చాలా నష్టం జరుగుతోంది. ఇటీవల టీవీ5కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిఆర్ఎస్ పార్టీ గురించి చెప్పిన విషయాలు పార్టీకి ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కనుక ప్రెస్మీట్లో కూతురు కల్వకుంట్ల కవిత విషయంలో కేసీఆర్ తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.