నేటి నుంచి పీసీ ఘోష్ కమీషన్ విచారణ షురూ

April 23, 2025


img

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ మళ్ళీ నేటి నుంచి విచారణ మొదలుపెట్టింది. కమీషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. కానీ విచారణ ఇంకా పూర్తి కానందున మరో రెండు నెలలు పొడిగించే అవకాశం ఉంది.

ఇప్పటికే మూడుసార్లు కమీషన్ గడువు పెంచినందున బహుశః ఇదే చివరి పొడిగింపు కావచ్చు. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న అధికారులను, పదవీ విరమణ చేసిన అధికారులను కమీషన్ ప్రశ్నించి వారు చెప్పిన వివరాలను రికార్డ్ చేసింది. కనుక కాళేశ్వరం ప్రాజెక్టుకి కర్త, ఖర్మ, క్రియ అన్నీ తామైనట్లు వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ సాగునీటి, ఆర్ధిక శాఖల మంత్రి హరీష్ రావు తదితరులకు నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచి ప్రశ్నించే అవకాశం ఉంది.

ఒకవేళ కమీషన్ వారిని విచారణకు హాజరవ్వాలని నోటీసులు పంపించినట్లయితే మళ్ళీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. కాంగ్రెస్‌-బిఆర్ఎస్ పార్టీల మద్య మరో యుద్ధం ప్రారంభమవుతుంది.

కానీ ఫోన్ ట్యాపింగ్, రేసింగ్ కేసులలోనే ఇంతవరకు కేసీఆర్‌, కేటీఆర్‌లను టచ్ చేయలేకపోయిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, సంక్లిష్టమైన కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో వారిపై ఏమైనా చర్యలు తీసుకోగలదా? అంటే అనుమానమే. 


Related Post