వడ్డించేవాడు మానవాడు అయితే ఎక్కడ కూర్చోన్నా ఆకులో అన్నీ పదార్ధాలు వచ్చి పడుతుంటాయి. అలాగే మనవాళ్లు అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు కానీ ఎవరూ పోలీసులకు పిర్యాదు చేయలేరు. కనీసం వేలెత్తి చూపలేరు.
బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ నేతలు అలాగే చెలరేగిపోయారు. వారిలో కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు కూడా ఒకరని ఆయనపై నమోదవుతున్న పోలీస్ కేసులు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఆయనపై మన్నెగూడా భూకబ్జా కేసు నమోదైంది. తాజాగా కిడ్నాప్ కేసు కూడా నమోదైంది.
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న విజయవర్ధన్ రావు ఆయనపై బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
ఇదివరకు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విజయవర్ధన్ రావు ఓ సమస్య పరిష్కారం కోసం కన్నారావుని కలిశారు. విజయవర్ధన్ రావు వద్ద చాలా నగదు, బంగారం ఉందనే విషయం తెలుసుకున్న కన్నారావు తన పరిచయస్తురాలైన నందిని అనే మహిళ, మరి కొందరి సాయంతో విజయవర్ధన్ రావుని తన గెస్ట్ హౌసులో నిర్బందించారు.
వారు తనను బెదిరించి రూ.60 లక్షల నగదు, 97 తులాల బంగారు ఆభరణాలు దోచుకున్నారని విజయవర్ధన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారితో పాటు ఏసీపీ కట్టా సాంబయ్య, మరో అధికారి భుజంగరావు తనను బెదిరించారని పిర్యాదులో పేర్కొన్నారు.
కానీ ఆ సమయంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నందున ఫిర్యాదు చేయడానికి వెనకాడనని, ఇప్పుడు కన్నారావుపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలుసుకొని వచ్చి ఫిర్యాదు చేశానని విజయవర్ధన్ రావు చెప్పారు. బంజారాహిల్స్ పోలీసులు కన్నారావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.