ప్రధాని నరేంద్రమోడీ నిన్న మహబూబ్ నగర్ సభలో చేసిన ప్రసంగం, సిఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం మీద చేసిన విమర్శలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ట్విట్టర్లో చాలా పెద్ద జవాబే ఇచ్చారు. దాని గురించి వివరించడం కంటే నేరుగా పాఠకుల ముందు ఉంచడమే మంచిది.
ఇంతకీ కేటీఆర్ ఏం ట్వీట్ చేశారంటే, “నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలు కాదు.. జాతీయస్థాయిలో అధికార మార్పు కావాలని కోరుతోంది దేశ ప్రజలు.. బిఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ కేసీఆర్గారి చేతిలోనే పదిలంగా ఉంది. కానీ బిజెపి స్టీరింగ్.. అదాని చేతిలోకి వెళ్లిపోయింది.
మీరు కిసాన్ సమాన్ కింద ఇచ్చింది కేవలం నామమాత్రం... కానీ ఒక చిన్న రాష్ట్రమైన తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ 70 లక్షల మంది రైతులకు 72 వేల కోట్లను నేరుగా ఖాతాల్లో వేసిన విషయం మీరు తెలుసుకుంటే మంచిది రైతుల రుణమాఫీ జరగనే లేదని మాట్లాడటం... మిలియన్ డాలర్ జోక్. స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక కొత్త రాష్ట్రం రెండుసార్లు రైతుల రుణమాఫీకి నడుం బిగించిన ఏకైక సందర్భం తెలంగాణలోనే ఆవిష్కృతమైంది. అన్నదాత అప్పులు మాఫీ చేసి జైకిసాన్ ప్రభుత్వం మాది..!
కార్పొరేట్ దోస్తులకు 14.5 లక్షల కోట్ల రుణాలను రద్దుచేసిన ..నై కిసాన్ సర్కారు మీది.! కర్షకుల రక్తం కండ్ల జూసిన రైతుహంతక రాజ్యం మీది..! పదేళ్లపాటు విభజన హామీలను పాతరేసి.. మీ ఎన్నికల హామీలను గాలికి వదిలేసి ఓట్ల వేటలో ఇప్పుడొచ్చి మాట్లాడితే నమ్మేదేవరు?
ప్రాజెక్టులు వల్ల చుక్క నీరు రాలేదనడం.. మీ అవివేకానికి నిదర్శనం. తెలంగాణలో సాగుతోంది సాగునీటి విప్లవం.. తెలంగాణ రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన మీరా మాట్లాడేది.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనమంటే నూకలు తినమన్న మీ కేంద్ర పెద్దల అవమానకర మాటలు తెలంగాణ రైతులు మరిచిపోలేదు..
మీరు ఎన్ని చెప్పినా.. మీ బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి నిన్న కాళేశ్వరం అయినా.. నేడు పాలమూరు ప్రాజెక్టు అయినా.. ప్రపంచ సాగునీటి చరిత్రలోనే అతి గొప్ప మానవ నిర్మిత అద్భుతాలు. భవిష్యత్తు ఇరిగేషన్ రంగానికే సరికొత్త పాఠాలు వీటిపై మీ ఆరోపణలు.. పూర్తిగా అవాస్తవాలు,” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.