ఇటు సినిమాలలో నటిస్తూ అటు ప్రత్యక్ష రాజకీయాలలో కూడా పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ఈరోజు తన ప్రచార వాహనం ‘వారాహి’ని జగిత్యాల జిల్లా కొండగట్టులోని అంజన్న ఆలయానికి తీసుకువచ్చి శాస్త్రోక్తంగా వాహనపూజ చేయించుకొన్నారు. పవన్ కళ్యాణ్ కొండగట్టుకి వస్తుంటే దారిపొడవునా వేలాదిమంది ప్రజలు, ముఖ్యంగా ఆయన అభిమానులు ఘనా స్వాగతం పలికారు. కొండగట్టు ఆలయం వద్దకి వేలాదిగా తరలివచ్చారు. కానీ వారందరినీ పోలీసులు, భద్రతాసిబ్బంది దూరంగా ఉంచడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ కాషాయరంగు పంచె ఒంటికి చుట్టుకొని వాహనపూజలో పాల్గొన్నారు.
అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, “తెలంగాణలో మాకు బలం ఉందనుకొన్న 7-14 లోక్సభ స్థానాలలో జనసేన పోటీ చేస్తుంది. ఒకవేళ ఎవరైనా మాతో కలిస్తే మంచిదే లేకుంటే ఒంటరిగానే పోటీ చేస్తాము. తెలంగాణ ప్రజలకి సందేశాలు ఇవ్వగల స్థాయి నాకు లేదు. నిజానికి తెలంగాణ ప్రజల నుంచే పోరాటస్ఫూర్తిని నేర్చుకొంటున్నాను,” అని అన్నారు.