రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్ మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా ఈరోజు నామినేషన్లు దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ రాహుల్ గాంధీతో సహా పలువురు విపక్ష నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో విశేషమేమీ లేదు కానీ టిఆర్ఎస్ తరపున ఆ పార్టీ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీలు హాజరవడమే విశేషం.
కాంగ్రెస్కు దూరం ఉండాలని నిశ్చయించుకొన్న టిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున అభ్యర్ధికే మద్దతు ఇవ్వడంపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, “మేము ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపది ముర్ముకి వ్యతిరేకం కాదు. కానీ ఈ 8 ఏళ్ళలో నిరంకుశంగా, చాలా అప్రజాస్వామికంగా పరిపాలిస్తూ, మతంపేరుతో దేశ ప్రజలను చీల్చుతున్న ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాము. అందుకే విపక్షాల ఉమ్మడి అభ్యర్ధికి టిఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకొంది. బిజెపికి బలంలేని రాష్ట్రాలలో అధికారం దక్కించుకోవడం కోసం నరేంద్రమోడీ ప్రభుత్వం ఈడీ, ఐటి, సిబిఐ వంటి రాజ్యాంగ వ్యవస్థలను ఉసిగొల్పుటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నిస్తుండటమే ఇందుకు తాజా ఉదాహరణ. కనుక ఇటువంటి అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తునట్లు తెలియజేసేందుకే టిఆర్ఎస్ పార్టీ విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తోంది,” అని చెప్పారు.