ఈటల కాంగ్రెస్‌లో జేరడం ఖాయం: కేటీఆర్‌

October 23, 2021


img

మంత్రి, తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ ఓడిపోవడం ఖాయం. ఆ తరువాత ఓ ఆర్నెల్లో ఏడాదిలోనో కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా అంతే ఖాయం. ఇందుకోసం ఈటల రాజేందర్‌, రేవంత్‌ రెడ్డిని గోల్కొండ రిసార్టులో రహస్యంగా కలిశారు. ఇది అబద్దమని వారు చెపితే నిజమని నిరూపించేందుకు వారి ఫోటోలను విడుదల చేస్తాము. 

ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ను ఎదుర్కొలేక కాంగ్రెస్‌, బిజెపిలు చీకటి ఒప్పందాలు చేసుకొన్నాయి. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ ఓట్లు బిజెపికి బదలాయించేందుకు రెండు పార్టీలు కలిసి కుట్రలు పన్నుతున్నాయి. గతంలో నిజామాబాద్‌, కరీంనగర్‌, నాగార్జునసాగర్ ఎన్నికలలో ఆ రెండు పార్టీలు ఇలాగే చేశాయి. హుజూరాబాద్‌లో బిజెపిని గెలిపించేందుకే కాంగ్రెస్‌ పార్టీ ఓ అనామకుడిని డమ్మీ అభ్యర్ధిగా నిలబెట్టింది. అయితే కాంగ్రెస్‌, బిజెపిలు ఎన్ని చీకటి ఒప్పందాలు చేసుకొన్నా హుజూరాబాద్‌లో టిఆర్ఎస్‌ గెలుపు ఖాయం,” అని అన్నారు.        



Related Post