తెలంగాణలో చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలలో పోడుభూముల వ్యవహారం ఒకటి. దీని వలన తరచూ పోడు భూములలో వ్యవసాయం చేసుకొంటున్న గిరిజన రైతులకు, అటవీశాఖ సిబ్బందికి మద్య ఘర్షణలు జరుగుతున్నాయి కూడా. ఈ సమస్యపై ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రాజకీయాలు చేస్తూ లబ్ది పొందాలని చూస్తున్నాయని అధికార టిఆర్ఎస్కు తెలుసు. కనుక ఈ సమస్యలను శాస్వితంగా పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సిఎం కేసీఆర్ ఆదేశం మేరకు పోడు భూముల పంపిణీ కోసం విధివిధానాల రూపకల్పన చేసేందుకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ మంగళవారం బీఆర్కె భవన్లో సంబందిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. దరఖాస్తుల స్వీకరణ, లబ్దిదారుల ఎంపిక, అటవీ, పోడు భూముల సరిహద్దుల గుర్తింపు, అటవీ పరిరక్షణ, దానిలో పౌరుల భాగస్వామ్యం కల్పించడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ అంశాలపై జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు, ఫారెస్ట్ ఆఫీసర్లు తదితరులతో మరోసారి సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నెలాఖరు నుంచి పోడు భూములలో వ్యవసాయం చేసుకొంటున్న రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సమావేశంలో నిర్ణయించారు.