ప్రధాని నరేంద్రమోడీ సుమారు ఆరు నెలల తరువాత మళ్ళీ విదేశీయాత్రకు బయలుదేరుతున్నారు. ఈనెల 24, 25 తేదీలలో అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడి అధికార నివాసమైన వైట్హౌస్లో ఈనెల 24న క్వాడ్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ముఖాముఖీ కలుస్తారు. ఈ క్వాడ్ సమావేశంలో జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా, ప్రధాని నరేంద్రమోడీ పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రధానంగా కరోనా కట్టడి, వాక్సినేషన్, ముఖ్యంగా నిరుపేద ఆఫ్రికన్ దేశాలలో ప్రజలకు కరోనా వ్యాక్సినేషన్ చేయించడానికి తీసుకోవలసిన చర్యలు, , వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలు, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ప్రభుత్వంతో ఏవిదంగా వ్యవహరించాలనే అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 25న న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొని ప్రసంగిస్తారు.
ప్రధాని నరేంద్రమోడీ అత్యంత సంక్లిష్టమైన వ్యక్తిత్వం కలిగిన మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో చాలా లౌక్యంగా వ్యవహరించి, భారత్కు అనుకూలంగా ఉండేలా చేయగలిగారు. డోనాల్డ్ ట్రంప్తో పోలిస్తే జో బైడెన్ చాలా సాదాసీదా వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కనుక ప్రధాని నరేంద్రమోడీ ఆయనను సులువుగానే మెప్పించి భారత్కు అనుకూలంగా మలుచుకోగలరని భావించవచ్చు.