తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పధకం పైలట్ ప్రాజెక్టును ఈనెల 16వ తేదీన సిఎం కేసీఆర్ హుజూరాబాద్లో ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా హుజూరాబాద్లో లక్షమంది దళితులతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, జిల్లా పోలీస్ కమీషనర్ సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్, కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు తదితరులు మంగళవారం శాలపల్లి-ఇందిరానగర్ వద్ద సభాస్థలిని పరిశీలించారు. ఈ బహిరంగసభకు కరీంనగర్తో సహా చుట్టుపక్కల జిల్లాల నుంచి దళితులను తరలించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు కనీసం లక్షమంది దళితులను హాజరుపరచగలిగితే దళిత బంధు పధకం గురించి సిఎం కేసీఆర్ చెప్పబోయే విషయాలు నేరుగా వారికి చేరుతాయని టిఆర్ఎస్ భావిస్తోంది.