పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో 7 స్థానాలకు మజ్లీస్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. బెంగాల్లోని అసన్సోల్ (ఉత్తర), భరత్పూర్, ఇథార్, రౌతా, సాగర్ ధిగి, మలాటిపూర్, జాలంగి నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్న మజ్లీస్ అభ్యర్ధుల పేర్లను కూడా అసదుద్దీన్ ఓవైసీ నిన్న ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “బిజెపి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మతరాజకీయాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకొని ఎన్నికలలో గెలవాలని చూస్తున్నాయి. రాష్ట్రంలో పోలింగ్ జరుగుతున్న తీరు చూస్తుంటే ఆ రెండు పార్టీలు ఎంతగా బరి తెగించాయో కళ్ళకు కట్టినట్లు కనబడుతోంది. కానీ ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. ఈ ఎన్నికలలో మా పార్టీ పోటీ చేస్తున్న ఏడు స్థానాలను తప్పకుండా గెలుచుకొంటుందని భావిస్తున్నాము,” అని అన్నారు.