ఈరోజు ఇబ్రహీంపట్నంలో టిఆర్ఎస్ హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహకసభ నిర్వహించింది. దానిలో మంత్రి హరీష్రావు మాట్లాడుతూ, “ప్రతిపక్షాలు తమను గెలిపిస్తే ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని మండలిలో ప్రశ్నిస్తామని చెప్పుకొంటున్నాయి. కానీ టిఆర్ఎస్ను గెలిపిస్తే ఎవరూ ప్రశ్నించనవసరం లేదు...వారే ప్రజాసమస్యలను పరిష్కరిస్తారు. బిజెపి ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు పట్టభద్రులను ఎప్పుడైనా పట్టించుకొన్నారా? తనకు మళ్ళీ ఓటేసి గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పుకొంటున్న ఆయన ఏనాడైనా మండలిలో వారి సమస్యలను ప్రస్తావించారా? ఎమ్మెల్సీగా ఉండగానే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసి తన రాజకీయ ఎదుగుదల గురించే ఆలోచించారు తప్ప తనను గెలిపించిన ప్రజల కోసం ఏమి చేశారు? ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన బిజెపి ఇప్పుడు ఏం చేస్తోంది? వేలాదిమందికి ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగసంస్థలను మూసివేసి వాటిలో పనిచేసే ఉద్యోగులను కూడా రోడ్డున పడేసేందుకు సిద్దపడుతోంది. బిజెపిని నమ్మి అధికారం కట్టబెడితే, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచేస్తూ సామాన్యప్రజలపై పెనుభారం మోపుతోంది. మన ఉద్యోగాలను కాపాడుకోవాలంటే బిజెపిని ఓడగొట్టి బుద్ది చెప్పాలి,” అని అన్నారు.