తెలంగాణ పాత అసెంబ్లీలో తూర్పు వైపుగల భవనంపైని ప్రహారీగోడ, గోపురం ఓ ఈరోజు మధ్యాహ్నం కూలిపోయింది. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కార్యాలయం ఆ భవనంలోనే ఉంది. కానీ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పెద్ద శబ్ధంతో పైకప్పు పక్కనే ఉన్న గార్డెన్లో కూలిపోయింది. దీంతో సమీపలోనే విధులు నిర్వహిస్తున్న అసెంబ్లీ సిబ్బంది ఏమయిందో తెలియక భయంతో దూరంగా పరుగులు తీశారు.
ప్రస్తుతం ఉపయోగిస్తున్న అసెంబ్లీ భవనం 107 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. కనుక ప్రస్తుత, భవిష్య అవసరాలకు తగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎర్రమంజిల్ వద్ద కొత్తగా అసెంబ్లీ భవన సముదాయాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం వినియోగిస్తున్న అసెంబ్లీ భవనాన్ని ఆరో నిజాం మహబూబ్ ఆలీఖాన్ హయాంలో (1905 నుంచి 1913 వరకు) నిర్మించబడింది. కానీ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ హయాంలో దానిని ఉపయోగించడం మొదలైంది.