తెలంగాణాలో తెలుగుదేశం పార్టీలో త్వరలో మరో వికెట్ పడబోతోంది. మాజీ కార్పొరేటర్, అంబర్ పేట నియోజకవర్గంలో పార్టీలో సీనియర్ నేత ఏ.చంద్రమౌళి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. కొద్దిరోజుల క్రితమే ఆయన సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంత రావును కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం గురించి చర్చించారు. పార్టీలో చేరితే సముచితస్థానం (ఎమ్మెల్యే టికెట్?) కల్పిస్తామని వి.హనుమంత రావు హామీ ఇచ్చినట్లు సమాచారం. కనుక నేడోరేపో చంద్రమౌళి తెదేపాకు గుడ్-బై చెప్పేసి కాంగ్రెస్ టోపీ పెట్టుకోవడం ఖాయమేనాని భావించవచ్చు.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చాలా బలహీనపడినప్పటికీ, పార్టీలో సీనియర్ నేతనైన తనకు జిల్లా కమిటీలలో ప్రాధాన్యం ఇవ్వకపోవడం, గ్రేటర్ ఎన్నికలలో కార్పొరేటర్ గా పోటీ చేయడానికి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు కనబడుతున్నందున ఇక ఆలస్యం చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయీ టికెట్ ఖరారు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే తుది నిర్ణయం ప్రకటిస్తానని చంద్రమౌళి చెప్పారు.