తెలంగాణలో కరోనా వైరస్ పూర్తి నియంత్రణలోనే ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ పరిధిలో నిత్యం కొన్ని కొత్త కేసులు బయటపడుతూనే ఉన్నాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు తిరిగి వచ్చిన వలస కార్మికులలో కూడా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. శుక్రవారం జీహెచ్ఎంసీ పరిధిలో 42, రంగారెడ్డి జిల్లాలో ఒక కేసు నమోదుకాగా, 19 మంది వలస కార్మికులకు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,761కి చేరింది. వారిలో 1,043 మంది కోలుకొని ఇళ్లకు తిరిగి వెళ్ళగా మరో 670 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం 48 మంది కరోనాతో మృతి చెందారు.
ప్రజారోగ్యశాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాలలో గత రెండు నెలల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
గత 14 రోజులలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కానీ జిల్లాలు: కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్ధిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, నల్గొండ, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణ్ పేట, వరంగల్ అర్బన్, జనగావ్, గద్వాల్, నిర్మల్.